
*వీరి నుంచి రూ.కోటి 11 లక్షలు స్వాధీనం…చేసుకున్న సైబరాబాద్ పోలీసులు
*విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్న ఏడుగురు సభ్యులు గల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి రూ.కోటి 11 లక్షలు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ క్రమంలో మొహాలీ, హైదరాబాద్కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారని,ఈ ముఠా నకిలీ కాల్ సెంటర్ ముసుగులో.. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తోంది. విదేశాల్లోని వారికి క్రెడిట్ కార్డులు సరఫరా చేస్తోంది. ముఠాలో కీలక సూత్రధారిగా న్యూ ఢిల్లీ కి చెందిన నవీన్ బొటానీ వ్యవరిస్తున్నాడని తెలిపారు.ఈ వ్యవహారంలో ఈ ముఠాకు చెందిన నవీన్ బొటాని కీలక పాత్ర పోషించారు. నవీన్ 2017లో ఆర్ఎన్ టెక్ సర్వీసెస్ అని ఒక కంపెనీని స్థాపించారు. ఇందులో 80 మందితో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ ముఠా ఢిల్లీ, మొహాలీ, ఘజియాబాద్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ క్రెడిట్ కార్డులు ఉన్నవారి సమాచారాన్ని సేకరించి మాటలతో మోసం చేసేవారని తెలిపారు.ఈ ముఠాలో హైదరాబాద్ కు చెందిన నలుగురు నాగరాజు,దొంతాల శ్రవణ్ కుమార్,ముక్కంటి శ్రీనివాస,పవన్ వెన్నెలకంటి ఉన్నారని, మిగతా ముగ్గురు న్యూ ఢిల్లీకి చెందిన వారని తెలిపారు. వీరు ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డులను అమ్మి.. ఇప్పటివరకు రూ.50 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు.విదేశీ క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఫ్రాంచైజీగా ఉన్న భారతీయ బ్యాంకులకు టోకరా వేసింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో..పక్కా ప్రణాళికతో దర్యాప్తు ముమ్మరం చేసాం. మరో రెండు ముఠాలు దుబాయ్ నుంచి పని చేస్తున్నట్లు తెలిసింది. మోసపోయిన బాధితులు వేలలోనే ఉన్నారని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.దీనిపై మరింత లోతుగా విచారిస్తున్నామని, ప్రజలు ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.మోసపోతున్నట్లు తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సీపీ సూచించారు.