
– సామాన్య భక్తులకు ఓర్పు, సహనంతో సేవలందించాలి.
– సర్వదర్శనం టోకెన్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తున్నాం.
– సామాన్య భక్తుల క్యూ లో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.
తెలంగాణ మిర్రర్, తిరుమల: శ్రీవారి సేవకులు భక్తులకు అందించే సేవ స్వామి వారికి చేసినట్లుగానే భావించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సామాన్య భక్తుడి వలే క్యూ లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయం లోపల శ్రీవారి సేవలో ఉన్న నిజామాబాద్ కు చెందిన లావణ్య తో పాటు వారి గ్రూప్ సభ్యులు భక్తులకు చేస్తున్న సేవను ప్రత్యక్షంగా చూసి వారిని అభినందించారు. శ్రీవారి సేవ ఎన్ని రోజులుగా చేస్తున్నారు. ఆలయంలో ఎన్ని రోజులు చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు. సామాన్య భక్తుల విషయంలో ఓర్పు, సహనంతో వ్యవహరించి దర్శనం చేయించి పంపాలని వారికి సూచించారు. శ్రీవారి సేవ రూపంలో భగవంతుడు భాగ్యం కల్పించారని, ఏ ప్రాంతంలో సేవ చేసినా స్వామి వారికి చేసినట్లు గానే భావించాలని చెప్పారు. క్యూలో ఉన్న భక్తులతో చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడారు. సర్వదర్శనం లో వచ్చే భక్తులకు టోకెన్ తీసుకున్న రోజే ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామన్నారు. అన్నదానం, కళ్యాణ కట్ట, దర్శనం వద్ద వసతులు బాగున్నాయని భక్తులు చైర్మన్ కు సంతోషంగా చెప్పారు. రెండేళ్ళ తరువాత సర్వదర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారని చైర్మన్ ను అభినందించారు. ఆన్లైన్ లో దర్శనం టికెట్ బుక్ చేసుకున్నామని, తిరుమల లో ఏర్పాట్లు బాగున్నాయని, దర్శనం కూడా సంతృప్తి గా జరిగిందని మధ్యప్రదేశ్ రాష్ట్రం దివాస్ పట్టణానికి చెందిన సురేంద్ర రాథోడ్ చైర్మన్ ను కలసి సంతోషం వ్యక్తం చేశారు.