
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మాదాపూర్ శిల్పారామంలో 27వ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్ మేళాను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. చేతి వృత్తులను కాపాడే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో శిల్పారామంలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత హస్త కళాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తులను అమ్ముకోవడానికి మరిన్ని మేళాలు వివిధ ప్రాంతాలలో నిర్వహించుకునేలా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.మాదాపూర్ శిల్పారామంలో ఈ సంవత్సరం నిర్వహిస్తున్న క్రాఫ్ట్ మేళాలో 500 పైగా వివిధ రకాలైన క్రాఫ్ట్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారని అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు, స్టాల్స్ నిర్వాహకులు, జాతీయ స్థాయిలో ప్రసిద్ధ కళాకారులు సంత్ కబీర్, శిల్ప గురువ్ ల తో పాటు 200 మంది కళా నైపుణ్యం ఉన్న కళాకారులు, శిల్పకళావేదికలో ఉన్న కళాకారులు సమిష్టిగా ఎన్నో కళాకృతులను తయారు చేసి విక్రయాలు చేస్తున్నారన్నారు. ఈ క్రాఫ్ట్ మేళా డిసెంబర్ 31 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ క్రాఫ్ట్ మేళా లో హస్తకళలు, చెక్క బొమ్మలు, జౌళి సంచులు, బొంగుతో తయారు చేసిన ఉత్పత్తులు, నారతో చేసిన పరికరాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధరలలో లభ్యమౌతాయని అన్నారు. అనంతరం క్రాఫ్ట్ మేళా లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఆయన ఈ క్రాఫ్ట్ మేళాకు వచ్చే సందర్శకుల కోసం ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని శిల్పారామం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, జాతీయ చేనేత , జౌళి శాఖల అధికారులు అరుణ్ కుమార్, నర్సింహులు, జనరల్ మేనేజర్ అంజయ్య , శిల్పారామం సిబ్బంది, కళాకారులు పాల్గొన్నారు.