
• రాయదుర్గంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బాలుర హాస్టల్ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
• హాజరైన ప్రభుత్వ విప్ గాంధీ,ఎమ్మెల్సీ వాణి దేవి, ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ రాయదుర్గంలో గల ప్రభుత్వ లెధర్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్లో రూ.3 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బాలుర హాస్టల్ను శుక్రవారం ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, టెక్నాలజీ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యా, వైద్యాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారని, తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తయారు కావాలన్నదే ఆయన ఆకాంక్ష అన్నారు. ప్రస్తుత తరుణంలో వృత్తివిద్యా కోర్సులకు మంచి ఆదరణ ఉందని, ఆసక్తిగల కోర్సులను నేర్చుకుని ఉన్నతశిఖరాలు అధిరోహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటి నుంచి రూ. 127.33 కోట్లతో 17 పాలిటెక్నిక్ కళాశాలల భవనాలను నిర్మించినట్లు తెలిపారు. 12 నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పడం జరిగిందని, ఇందులో 4 కళాశాలలను ప్రత్యేకంగా బాలికల కోసం, 1 ఎస్టీ బాలురకు కేటాయించడం జరిగిందన్నారు. పాలనా వ్యవహారాల్లో పారదర్శకతను పాటించేందుకు, త్వరితగతిన పనులను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ సాంకేతిక శాఖ కార్యాలయాలకు, పాలిటెక్నిక్ కళాశాలలను అనుసంధానం చేసినట్లు తెలిపారు.రాయదుర్గంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చి విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. కళాశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు అభివృద్ధిలో భాగస్వాములవ్వాలన్నారు. విద్యనభ్యసిస్తూ వస్తువులను తయారు చేసి మార్కెట్కు అందించే స్థాయికి ఎదగాలన్నారు. లెదర్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్, ఫుట్వేర్ టెక్నాలజీలకు మంచి డిమాండ్ ఉందన్నారు.అసంపూర్తిగా మిగిలిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్,శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ రూ.10 లక్షలు, ఎమ్మెల్సీ వాణిదేవి రూ. 10 లక్షలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఇనిస్టిట్యూట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో లెదర్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది, శేరిలింగంపల్లి తాసీల్దార్ వంశీమోహన్, ఆర్ఐ చంద్రారెడ్డి, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావు , మాజీ కార్పొరేటర్ రవిందర్ ముదిరాజ్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, చాంద్పాషా, రామేశ్వరమ్మరెడ్డి, రవిశంకర్ నాయక్, రమేష్, ఊట్ల క్రిష్ణ, వెంకట్రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.