
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : గత కొన్ని రోజులుగా భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీకాల వేగాన్ని పెంచింది.రేపటి నుంచి (జనవరి 10 )కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్లను ప్రవేశపెడుతుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని సన్నాహాలు పూర్తి చేసింది.ఇందులో ఫ్రంట్లైన్ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా బూస్టర్ డోస్ ఇస్తారు. వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోస్ ఇస్తారు. ఇంతకు ముందు రెండు డోస్లు వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ కోసం నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. టీకా కేంద్రానికి వెళ్లి బూస్టర్ డోస్ వేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోస్కి అర్హులు అవుతారు. అంటే మీరు గత సంవత్సరం జనవరి, మార్చి మధ్య రెండో డోస్ తీసుకొని ఉండాలి. అప్పుడే బూస్టర్ డోస్ వేస్తారు.
బూస్టర్ డోస్కి ఎవరు అర్హులు..
బూస్టర్ డోస్కి మీరు అర్హులైతే ప్రభుత్వం నుంచి మీ సెల్ఫోన్కి మెస్సేజ్ వస్తుంది. మొదటి రెండు డోస్లు ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోస్గా ఇస్తారు. మొదటి రెండు డోస్లు కొవాక్సిన్ అయితే బూస్టర్ డోస్ కూడా కోవాక్సిన్ ఇస్తారు. అదేవిధంగా మొదటి రెండు డోసులు కోవిషీల్డ్ అయితే బూస్టర్ డోస్ కూడా కోవిషీల్డ్ ఇస్తారు.బూస్టర్ డోస్ కోసం ప్రజలు మళ్లీ నమోదు చేసుకోవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ వివరాలు ఇదివరకే కోవిన్లో ఉంటాయి. వాటిద్వారా మీరు బూస్టర్ డోస్కి అర్హులో కాదో నిర్ణయిస్తారు. అనంతరం మీ సెల్ఫోన్కి మెస్సేజ్ పంపుతారు. అప్పుడు మీరు కోవిన్ ద్వారా బూస్టర్ డోస్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అయితే కరోనావైరస్కి వ్యతిరేకంగా తయారైన రోగనిరోధక శక్తి కొన్ని నెలల తర్వాత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతన్నారు. అందువల్ల బూస్టర్ డోస్ ఇస్తున్నారు.