
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆరోగ్య,ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 15 వేల మంది ఆశావర్కర్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ లతో కలిసి శిల్పకళావేదికలో మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లే వాళ్లమని.. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని వెల్లడించారు.దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ చెప్పారు. కేసీఆర్ కిట్తో మాతా శిశు మరణాలను తగ్గించామని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.