
తెలంగాణ మిర్రర్, తిరుమల : తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటికి విశేషంగా భక్తులు తరలివచ్చారు. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తరువాత అనుమతించడంతో భక్తులు ఉత్సాహంగా విచ్చేశారు. ప్రతి ఏడాదీ ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థ ముక్కోటి జరుగుతుంది. గురువారం ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి శుక్రవారం ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు భక్తులను అనుమతించారు. మొత్తం 12300 మందికిపైగా భక్తులు తుంబురు తీర్థాన్ని సందర్శించారు.
టటిడి విస్తృత ఏర్పాట్లు…
..తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పాపవినాశనం డ్యామ్ వద్ద శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. పాపవినాశనం డ్యామ్ వద్ద ప్రథమ చికిత్స కేంద్రం, రెండు అంబులెన్స్లు, తుంబురు తీర్థం వద్ద ఒక వైద్యబృందాన్ని అందుబాటులో ఉంచారు. పలువురు భక్తులకు ఉచితంగా మందులు, మాత్రలు అందించారు. భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించేందుకు వీలుగా పాపానాశనం నుండి దారి పొడవునా పలు చోట్ల తాగునీటి కొళాయిలు ఏర్పాటుచేశారు. మార్గమధ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా నిచ్చెనలు, బ్యారీకేడ్లు, ఇనుప కంచెలు, రోప్లు ఏర్పాటు చేశారు.
ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 80 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ సిబ్బందిని వుంచి భద్రతా ఏర్పాట్లు చేశారు.