
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గోల్ఫ్ లో రజత పతకం సాధించిన గౌలిదొడ్డి గురుకుల పాఠశాలకు చెందిన ఎం.అనూషను మంగళవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు . ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ అనూష రజత పతకం సాధించడం అభినందనీయమని హర్షం వ్యక్తంచేశారు. గురుకులాల నుండి పతకం సాధించిన మొదటి క్రీడాకారిణిగా అనూష గుర్తింపు తెచ్చుకుందని, భవిషత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ రామ్ లక్ష్మణ్, ఫిజికల్ డైరెక్టర్ వై. సత్యనారాయణ గోల్ఫ్ ప్రొఫెషనల్ కోచ్ భాస్కర్ శామ్యూల్, నిరంతరం కృషి చేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని సీపీ అభినందించారు. గోల్ఫ్ ప్రొఫెషనల్ కోచ్ భాస్కర్ శామ్యూల్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో డిసెంబర్ 24, 25వ తేదీల్లో నిర్వహించిన ఐజీయూ సౌత్ జోన్ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ లో అనూష సి – కేటగిరీలో రెండు రౌండ్లలో ప్రతిభ చాటి 28 , 24 స్కోర్ సాధించి రజత పతకం గెలుపొందిందన్నారు. గత ఏడాదిలో బెంగళూర్, మైసూర్, కోయంబత్తూర్ లో జరిగిన సౌత్ జోన్ టోర్నీలో పాల్గొందన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల హైదరాబాద్ లోని గౌలిదొడ్డిలో ప్రత్యేక గోల్ఫ్ అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. 2019 నుంచి అనూష అకాడమీలో శిక్షణ తీసుకుంటుందన్నారు. అకాడమీ విద్యార్థులను ప్రతీ గురువారం వికారాబాద్ లోని ఊటీ గోల్ఫ్ అకాడమీ మైదానంలో ప్రాక్టీస్ చేయించేవారన్నారు. దీంతో అనతికాలంలోనే అనూష గోల్ఫ్ క్రీడలో పట్టు సాధించిందని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన సౌత్ జోన్ సెలక్షన్స్ లో అనూష ఎంపికై టోర్నీలో పాల్గొని పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు.