
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ లో డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృతి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ నగర్ లోని సమస్యలు,అభివృద్ధి పనులపై శుక్రవారం జిహెచ్ఎంసి,జలమండలి అధికారులతో కలిసి పర్యటించిన పర్యవేక్షించారు.అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ మ్యాన్ హోల్ నుండి ప్రతి మ్యాన్ హోల్ వరకు ఎయిర్ టెక్ మిషన్ ద్వారా పూడికను తొలగించామని అదేవిధంగా డ్రైనేజి నీరు ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని ప్రతి మ్యాన్ హోల్ వద్ద ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని,తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ స్పష్టం చేశారు.ముఖ్యంగా డ్రైనేజి, మంచి నీరు , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొండాపూర్ డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్,ఏఈ జగదీష్,జలమండలి మేనేజర్ నివర్తి, మాజీ కార్పొరేటర్ రంగరావు , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,తెరాస నాయకులు రాజు యాదవ్ ,గంగారాం యాదవ్ ,మాదాపూర్ విలేజ్ వాసులు శాస్త్రి , ఇంద్రసేన ముదిరాజు, నర్సింగ్ యాదవ్, కిషన్ ,నర్సింగ్ ఠాకూర్,గోపాల్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు.